Monday, 1 October 2007

మన ఉనికి సంగతేమిటి మహా ప్రభో!


రామ సేతు లేదా ఆడంస్ బ్రిడ్జిగా పేర్కొంటున్న ఇండో-శ్రీ లంక నిర్మాణంపై రాజకీయ దృష్టికోణంలో జరుగుతున్న చర్చలను పక్కన పెడితే పర్యావరణ పరంగా ఆ నిర్మాణం వలన ఉపఖండానికి జరుగున్న మేలు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. మానవ వైజ్ఞానిక శక్తులు ఎంతముందుకి పురోగమించినా నేటికీ అంతుబట్టని ప్రాకృతిక రహస్యాలు అనేకం ఇప్పటికీ చిక్కుముడులుగానే మిగిలిపోయాయి. ఈ నేపధ్యంలో పాక్ జలసంధిలోని సముద్ర స్థితిగతులపైనా, అక్కడి భూభౌతిక పరిస్థితులపైన సమగ్రమైన అవగాహన లేకుండా తొందర పాటు చర్యలకు పూనుకోవడం తెలివిమాలిన పని. ఇది తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడంలాంటిది.ఇటీవలి సునామీ తీవ్రతను తగ్గించడంలోనూ,సముద్ర జీవావరణాన్ని సంతులన పరచడములోనూ రామ సేతు నిర్వహిస్తున్న పాత్ర కీలకమైనదన్న వాదనను తీసిపారేయకుండా ఈ కోణంలో తగిన పరిశోధన గావించడం అత్యావశ్యకం. లేకుంటే అటుపిమ్మట జరిగే మహ విపత్తులకు మానవాళి భారీ మూల్యం చెల్లించవలసిరావచ్చు.
ఇది కాకుండా గ్రాండ్ కెన్యాన్,మాజిక్ రాక్ వంటి భౌగోళిక అద్భుతాలను పరిరక్షించు కోవడానికి ప్రపంచంలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మనము మాత్రం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రకృతి సిద్ద రూపాలకు మంగళం పాడుతున్నాము. ఇది ఆలోచించవలసిన సంగతి.

No comments: